పోచారం కాల్పుల కేసులో పురోగతి.. ముగ్గురు నిందితుల అరెస్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 05:29:09  IST  )

మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగిన కాల్పులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

పోచారం కాల్పుల కేసులో పురోగతి.. ముగ్గురు నిందితుల అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగిన కాల్పులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోరక్షక్ ప్రశాంత్‌సింగ్‌ (Prashanth Singh) అలియాస్‌ సోనుసింగ్‌పై కాల్పులు జరిపిన కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ ఉన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హనీఫ్ ఖురేషి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక కాల్పుల్లో గాయపడిన ప్రశాంత్ సింగ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు.

కాగా, కీసర మండల పరధిలోని రాంపల్లికి చెందిన సోనుసింగ్‌ అలియాస్‌ ప్రశాంత్‌ సింగ్ గోసంరక్షణ కార్యకర్త. పశువుల అక్రమ రవాణాను గుర్తించి హిందూ సంఘాలకు సమాచారం చేరవేస్తుంటారు. ఇటీవల వరంగల్‌ వైపు నుంచి పశువులతో వస్తున్న లారీని ఆపేందుకు సోనుసింగ్‌ కారులో వెంబడించారు. ఆ సమయంలో లారీలోని ఒక వ్యక్తితో గొడవ పడ్డారు. లారీ డ్రైవరు ఆపకుండా టోల్‌గేట్‌ వద్ద అడ్డుపెట్టిన బారికేడ్లను ఢీకొంటూ వెళ్లిపోయాడు. బుధవారం సాయంత్రం రాంపల్లి వైపు నుంచి కారులో వస్తున్న సోనుసింగ్‌ను ఇబ్రహీం అనే వ్యక్తి వెంబడించాడు. యమ్నంపల్లి వద్దకు రాగానే కారును అడ్డగించి గోవులను తరలిస్తున్న విషయం గోరక్షాదళ్‌కు అందిస్తున్నావంటూ సోనుసింగ్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి.. ఒకరినొకరు నెట్టుకుంటూ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు. అనంతరం నిందితుడు ఇబ్రహీం తుపాకీతో సోనుసింగ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ఒక తూటా పక్కటెముకల్లోకి దూసుకెళ్లటంతో సోనుసింగ్‌ కింద పడిపోయాడు. బాధితుడిని స్థానికులు మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు.

Read More: వీడిన పోచారం కాల్పుల మిస్టరీ..

Next Story